John - యోహాను సువార్త 12 | View All

1. కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.

పస్కా గురించి నోట్స్ నిర్గమ 12వ అధ్యాయం; లేవీయకాండము 23:4-8. క్రీస్తు సిలువ మరణానికి ముందు వారంలో జరిగిన సంగతులు ఇక్కడ నుంచి ఆరంభమౌతున్నాయి. లోక పాపాల కోసం ఆయన చనిపోవలసిన సమయం వచ్చింది. దేవుడే ఆ సమయాన్నీ (ఈ పస్కా దినం), స్థలాన్నీ (జెరుసలం) నిర్ణయించాడు. యేసుప్రభువు ఆ పరమ తండ్రి చిత్తం ప్రకారం చేయడానికి పూర్తిగా సిద్ధపడి ఉన్నాడు.

2. మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.

మత్తయి 26:6-13; మార్కు 14:19 పోల్చి చూడండి. మత్తయి, మార్కు శుభవార్తలో రాసి ఉన్న సంఘటనా ఇదీ వేరువేరని కొందరు పండితుల అభిప్రాయం.

3. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను

4. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా

ఈ మాట అన్నది యూదా అని మత్తయి, మార్కు రాయలేదు.

5. యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.

ఒక దేనారం సాధారణంగా ఒక పనివాడికి ఒకరోజు కూలీ (మత్తయి 20:2). స్వార్థంకోసం గాక క్రీస్తుకోసం ప్రేమతో చేసిన పనులను ఇతరులు అపార్థం చేసుకుని విమర్శించవచ్చని గమనించండి. డబ్బును కూడబెట్టడం, స్వార్థానికి వాడుకోవడం యూదాకు తెలుసు గానీ కేవలం తనలోని ప్రేమ మూలంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా మరియ అంత ఖరీదైనదాన్ని క్రీస్తు పాదాలపై ఒలకబోయడం యూదాకు అర్థం కాలేదు.

6. వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.

యూదా ఒకసారి దుష్‌ప్రేరణకు లొంగి, ఏదో దొంగిలించి తరువాత పశ్చాత్తాపపడి తన బలహీనతలను జయించిన రకం కాదు. దేవుని ప్రజలు దేవుని పనికోసం ఇచ్చిన డబ్బును అతడు కావాలని, అలవాటుగా తనకోసం తీసుకుంటూ వచ్చాడు. ఘనమైన, యోగ్యమైనవాటి కంటే, సత్యం లేక క్రీస్తు కంటే అతడికి డబ్బునే ఎక్కువ ప్రీతి. క్రీస్తును శత్రువులకు పట్టివ్వడంలో అతని ముఖ్యోద్దేశం డబ్బు (మత్తయి 26:14-16). అతణ్ణి పిశాచంగా చేసిన లక్షణాల్లో (యోహాను 6:70-71) డబ్బంటే అతనికి ఉన్న ప్రీతి ఒకటి. ఈ దురాశకు లోబడినవారికి ఏం సంభవించగలదో తెలిపే భయానకమైన ఒక ఉదాహరణ యూదా (1 తిమోతికి 6:5, 1 తిమోతికి 6:9-10 చూడండి). క్రీస్తు సంఘంలోపలా బయటా కూడా ధన లాభం కోసం తమ జీవితాలను పాడు చేసుకుని, దేవుణ్ణి అగౌరవపరచి, తమ ఆత్మలను నాశనానికి గురి చేసుకున్న అనేకమందిలో యూదా ఒకడు. క్రైస్తవ సేవలో ఉన్నవారిలో కూడా చాలామందిని డబ్బు విషయంలో నమ్మడానికి వీలు లేదు. ఎంత విచారం! యూదాలాగా వీరు కూడా తాము దొంగలమని రుజువు చేసుకుంటారు. అయితే ఇతర శిష్యులు యూదాను ఎలా ఎంచారో చూడండి. అతణ్ణి నమ్మి తమ గుంపుకు కోశాధికారిగా పెట్టుకున్నారు. ఈ వచనంలో యూదా కపటాన్ని కూడా గమనించండి. పేదలంటే అతనికేమీ శ్రద్ధ లేదు గానీ ఉన్నట్టు నటిస్తున్నాడు. అతని ఉద్దేశమేమిటంటే పేదలకియ్యవలసిన డబ్బు భద్రం చేయమని తన చేతికే ఇస్తారు. అందులో కొంత తన సొంతానికి వాడుకోవచ్చు అని. డబ్బు వాసన తగిలింది, అంతే! దేవుని కుమారుడు, ఆయన ఆశ్చర్యకరమైన ఉపదేశాలు, అద్భుత క్రియలు, ఆయన ఇస్తున్న శాశ్వత జీవం ఇవన్నీ యూదాకు వట్టివి, తృణప్రాయమయ్యాయి. ఇంకా ఇంకా డబ్బు సంపాదించే మార్గంగా తప్ప వేరే ఉద్దేశంతో పైవాటిని ఎన్నడూ చూడలేదు యూదా. ఈ విషయం గురించి యేసుప్రభువు చేసిన ఉపదేశాలను పూర్తిగా పెడచెవిన బెట్టాడు (మత్తయి 6:19-21, మత్తయి 6:24; లూకా 6:20, లూకా 6:24; లూకా 12:20-21, లూకా 12:33). మనం కూడా అలానే వాటిని నిర్లక్ష్యం చేస్తే యూదాలాగా అయిపోగలం. అబద్ధాలు, మోసం, దొంగతనం ఇలాంటివన్నీ చేయడంకన్నా పేదవారుగా ఉండడం ఎంతో మేలు – సామెతలు 19:22.

7. కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;

మత్తయి 26:10-13.

8. బీదలు ఎల్లప్పు డును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 15:11

9. కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి.

10. అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాస ముంచిరి గనుక

ఈ అవిశ్వాసుల స్వభావం (మొత్తంగా అవిశ్వాసులందరిదీ) ఇక్కడ మరోసారి బయట పడుతున్నది. యేసు లాజరును సజీవంగా లేపిన సంగతిని వారు కాదనలేకపోయారు. అందుకు బలమైన స్పష్టమైన రుజువు ఉంది. కానీ ఈ రుజువు చూపించిన దిశగా వెళ్ళవలసింది పోయి ఆ రుజువునే రూపుమాపాలని నిర్ణయించుకున్నారు. యిర్మియా 36:1-26 పోల్చి చూడండి.

11. ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.

12. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని

మత్తయి 21:4-9; మార్కు 11:9-10; లూకా 19:37-38. నాలుగు శుభవార్తల్లోనూ ఆ జనసమూహం అన్నమాటలు వేరువేరుగా రాసి ఉన్నాయి. వీటిల్లో ఏవీ సరైనవి? అన్నీ సరైనవే. ఏ ఒక్క శుభవార్తలో జనసమూహం అన్న మాటలన్నీ రాసిలేదు. ప్రతి ఒక్కటీ ఆ గుంపులు అన్న మాటల్లో కొన్ని రాసి ఉన్నాయి. యోహాను 19:19 పోల్చి చూడండి. మార్కు 4:1-20 గురించిన నోట్స్ చూడండి.

13. ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.
కీర్తనల గ్రంథము 118:25-26

14. సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు

మత్తయి 21:1-3.

15. అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.
యెషయా 40:9, జెకర్యా 9:9

16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చు కొనిరి.

యేసు మరణం, పునర్జీవితం తరువాత (“మహిమాస్థితి పొందిన తరువాత”) శిష్యులు చాలావరకు అర్థం చేసుకున్నారు. లూకా 24:45 పోల్చి చూడండి.

17. ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతు లలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.

18. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి.

“సూచన”– యోహాను 2:11.

19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.

ఈ సంఘటనతో వారు భయపడుతూ వచ్చినదే నిజమైనట్టు అనిపించింది (యోహాను 11:47-48).

20. ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి.

పస్కా యూదుల పండుగ, గ్రీకులు (ఇతర దేశస్థులెవరూ కూడా) యూద మతంలోకి మారితే తప్ప యూద పండుగల్లో ఏవిధంగానైనా పాల్గొనే అవకాశం ఉండదు. గ్రీకుల్లో ఇలాంటివారు ఉన్నారని అపో. కార్యములు 17:4 వంటి వచనాల ద్వారా తెలుస్తున్నది.

21. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా

ముందు కాలంలో ఈ విధంగా ఆశించబోయే అనేకమంది గ్రీకులు, ఇతర జాతీయులందరిలోకి ఈ గుంపు మొదటివారు. వారు క్రీస్తులో నమ్మకం పెట్టుకుంటే వారి కోరిక నెరవేరుతుంది (ప్రకటన గ్రంథం 7:9; ప్రకటన గ్రంథం 22:4).

22. ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.

ఇలాంటి కోరిక గురించి నిర్ణయం తీసుకోవాలంటే సాటి శిష్యుడు మరొకణ్ణి సంప్రదించడం అవసరమని ఫిలిఫ్పు అనుకున్నాడు. ఈ గ్రీకుల కోరిక తీరిందో లేదో రాసి లేదు. కానీ యేసు ఈ సందర్భాన్ని తన మరణం గురించి మాట్లాడేందుకు వాడుకున్నాడు. గ్రీకులు గానీ వేరెవరైనా గానీ పరలోకంలో స్థలం సంపాదించుకోవాలన్నా, దేవుణ్ణి చూడాలన్నా ఇది ముందుగా నెరవేరవలసి ఉందని ఆయనకు తెలుసు.

23. అందుకు యేసు వారితో ఇట్లనెను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి యున్నది.

వ 16; యోహాను 17:1, యోహాను 17:5 చూడండి.

24. గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.

“ఖచ్చితంగా”– యోహాను 1:51.

25. తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

ప్రభువు ఇదే సత్యాన్ని కొద్దిగా వేరే మాటల్లో అనేక సందర్భాల్లో చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఇది ఆయన చెప్పిన అతి ప్రాముఖ్యమైన సత్యాల్లో ఒకటి. దీన్ని నిర్లక్ష్యం చెయ్యడం మనకే హానికరం. మత్తయి 10:39; మత్తయి 16:25; మార్కు 8:35; లూకా 9:24; లూకా 17:33. ఇక్కడ యోహాను శుభవార్తలో ఆయన “ద్వేషం” అనే మాట వాడడం ద్వారా దీన్ని మరింత నొక్కి చెప్తున్నాడు. లూకా 14:26 పోల్చి చూడండి. అంతేగాక “శాశ్వత జీవం” అనేమాట వాడడం ద్వారా నిజంగా మనం క్షణికమైన ఈ లోకాన్నో, దేవుని సన్నిధిలో అనంత జీవితాన్నో ఎంచుకోవలసి ఉందని స్పష్టం చేశాడు. ఈ లోకమా, రాబోయే లోకమా మనం దేనికి విలువ ఇస్తామో, దేనికోసం బ్రతుకుతామో నిర్ణయించుకోవాలి.

26. ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

యోహాను 10:27. తన సొంత విషయాన్ని తన సొంత విధానంలో చేసేవారెవరూ క్రీస్తును సేవించడం లేదు. క్రీస్తును అనుసరించేవారు ఈ లోకంలో ఆయనెక్కడ ఉంటాడో అక్కడ ఉంటారు. ఎందుకంటే ఆయన వారి కాపరి. వారెక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయనే నడిపిస్తాడు. ఇలా చెయ్యడంలో పరీక్షలు, ప్రమాదాలు, అపాయాలు, బాధలు, క్రీస్తుకోసం చనిపోవడం సంభవించినా దానంతటిలో ఆయన వారితో, వారు ఆయనతో ఉంటారు. ఆయన్ను అనుసరించేవారు రాబోయే లోకంలో కూడా అనంత కాలం ఆయనతో ఉంటారు. వారి గురించి ఆయన చేసిన ప్రార్థన ఇదే (యోహాను 17:24) గనుక వారికి చేకూరబోయేది ఇదే. క్రీస్తు సేవకులకు ఈ లోకంలో ఎంతో అన్యాయం, హింస, అవమానం, అప్రతిష్ఠ ఎదురు కావచ్చు. వారి ప్రభువును చేసినట్టు వారిని కూడా మనుషులు తృణీకరించి నిరాకరించ వచ్చు. వారికి కలగవలసిన గౌరవాలు ముందున్నాయి. శాశ్వతుడైన దేవుడు తానే క్రీస్తు సేవకులను హెచ్చించి, మెచ్చుకుని, గౌరవించి, బహుమతులిస్తాడు (యోహాను 5:44; మత్తయి 25:21; రోమీయులకు 2:6-10; రోమీయులకు 8:18; హెబ్రీయులకు 6:10; 1 పేతురు 5:1, 1 పేతురు 5:4; ప్రకటన గ్రంథం 22:12). వారికిక్కడ జరిగిన నష్టమేదైనా ఉంటే దానంతటికీ ఆయన పుష్కలంగా పరిహారం చెల్లిస్తాడు. అందువల్ల ఏ గౌరవాన్ని మనం ఆశించాలి, ఎవరి మెప్పును కోరాలి – మనుషులవల్ల కలిగేదాన్నా లేక దేవునినుంచి వచ్చేదాన్నా అని ఎన్నుకోవాలి.

27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును?తండ్రీ, యీ గడియ తటస్థింపకుండనన్ను తప్పించుము; అయి నను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;
కీర్తనల గ్రంథము 6:3, కీర్తనల గ్రంథము 42:5, కీర్తనల గ్రంథము 42:11

“ఘడియ”– అంటే ఆయన బాధలు, మరణం కలిగే సమయం. లోక పాపాలకు బలిగా, మనుషుల దోషాలను భరిస్తూ, వాటికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాన్ని అనుభవించాలన్న ఆలోచన క్రీస్తుకు మనోవేదనలు కలిగించింది. మత్తయి 26:37-38; లూకా 22:42-44 పోల్చి చూడండి. అయినా అది దేవుని సంకల్పం అయితే తప్ప, దానినుంచి తప్పించుకోవాలని మాత్రం ఆయన ప్రార్థన చేసేవాడు కాదు. అది దేవుని సంకల్పం కాదని ఆయనకు తెలుసు.

28. తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతటనేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.

కొన్ని రోజుల తరువాత గెత్‌సేమనే తోటలో ఆయన ప్రార్థించినట్టుగానే ఆయన కోరినదల్లా తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలనే, తనకు కాదు; తండ్రి సంకల్పం నెరవేరాలనే, తనది కాదు. తండ్రికి మహిమ కలిగేలా తాను సిలువ బాధలు భరించడానికి ఆయన సిద్ధమే. ఆయన్ను అనుసరించేవారంతా ఇలా ప్రార్థించడం నేర్చుకోవాలి. మత్తయి 6:9-10 చూడండి. శుభవార్త గ్రంథాల్లో ఈ విధంగా పైనుంచి దేవుడు మాట్లాడ్డం ఇది మూడో సారి (మత్తయి 3:17; మత్తయి 17:5). పాత ఒడంబడిక గ్రంథంలో వర్ణించిన సంభవాల మూలంగా, యేసుప్రభువు జీవితమూ, పరిచర్యా అంతటిద్వారా దేవుడు తన పేరును మహిమపరచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు మరణం, పునర్జీవితం ద్వారా ఆయన దాన్ని మహిమపరచుకుంటాడు.

29. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.

నిర్గమకాండము 19:16-19; కీర్తనల గ్రంథము 29:3. “దేవదూత”– ఆదికాండము 16:7. ఈ మాటలు కొందరికి అర్థం అయినట్టున్నాయి. కొందరికి అర్థం కాలేదు. కానీ ఏదో అసాధారణమైనది జరిగిందని మాత్రం అందరికీ తెలిసింది.

30. అందుకు యేసు ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.

క్రీస్తుకు అంత బాగా తెలిసిన విషయాన్ని వేరొకరు మళ్ళీ ఆయనకు చెప్పనవసరం లేదు. మనుషులకు మాత్రం చాలా గట్టిగా నొక్కి చెప్పాలి.

31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;

దోషులైన మనుషుల స్థానంలో లోక పాపాలను మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు చనిపోబోతున్నాడు (యోహాను 1:29). అంటే మానవజాతి అంతా మరణానికి పాత్రులని అర్థం. సిలువ మనుషుల పాపాలకు తీర్పు చెప్పినట్టుంది. దేవుడు లోకులతో ఇలా అంటున్నాడన్నమాట: “నీ పాపాల కారణంగా నువ్వు మరణం పొందవలసినవాడివి. నీ స్థానంలో నా కుమారుని మరణం ద్వారా నేను ఈ తీర్పును ప్రకటిస్తున్నాను. నా కుమారుణ్ణి సిలువ వేయడంద్వారా నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటావు. ఆ విధంగా నా నిర్ణయం సరైనదేనని రుజువు చేసుకుంటావు” (యోహాను 3:18-19). “లోక పాలకుణ్ణి”– అంటే సైతానును యోహాను 14:30; యోహాను 16:11; 2 కోరింథీయులకు 4:4; ఎఫెసీయులకు 2:2; ఎఫెసీయులకు 6:12 చూడండి. మనుషులకు చాలా ఇష్టమైన చీకటిలో (యోహాను 3:19), ఏకైక నిజ దేవుణ్ణి ఎరుగని పాపుల హృదయాల్లో వాడు రాజ్యమేలుతుంటాడు. సైతాను గురించి నోట్స్ యోహాను 8:44; 1 దినవృత్తాంతములు 21:1; మత్తయి 4:1-10. “బయటికి త్రోసివేయడం” అంటే లోకంలో నుండి వెళ్ళగొట్టడమని కాదు యేసుప్రభువు ఉద్దేశం. ఎందుకంటే సైతాను ఇంకా నిక్షేపంగా ఈ లోకంలోనే ఉన్నాడు (1 పేతురు 5:8). క్రీస్తు మళ్ళీ వచ్చేవరకు వాణ్ణి లోకంలోనుంచి బయటికి వెళ్ళగొట్టడం జరగదు (ప్రకటన గ్రంథం 20:13). కాబట్టి ఇక్కడ దీని అర్థం ఇది కావచ్చు – సిలువ ద్వారా యేసు క్రీస్తు మనుషులకు విముక్తిని సాధిస్తాడు. దీని ఫలితంగా సైతాను చివరికి పూర్తిగా ఓడిపోతాడు. అన్ని దేశాల్లోనూ ఇంతకుముందు సైతాను పరిపాలన కింద ఉన్న మనుషులు దేవునివైపు తిరుగుతారు, చివరికి లోకమంతా దేవుని పరిపాలనకు లోబడి, ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది (యెషయా 11 అధ్యాయం; మొ।।). దీనంతటికీ సిలువ ఆధారం. తాత్కాలికంగా సైతాను విజయంగా అనిపించిన సిలువ వాడి సమూల నాశనానికి దారి తీసేది.

32. నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.

యోహాను 3:14; యోహాను 8:28 పోల్చి చూడండి. “పైకెత్తడం”– సిలువను సూచించే మాట. మనుషులందరినీ తనవైపుకు ఆకర్షించుకోవడం అంటే మనుషులంతా పాపవిముక్తి పొందుతారని కాదు (యోహాను 8:24; మత్తయి 7:13-14; మత్తయి 25:46; ప్రకటన గ్రంథం 21:8 చూడండి) యేసు యూద జాతినుంచి మాత్రమే గాక అన్ని జాతులు, జనాలు, వంశాలనుంచి మనుషులను తనవైపుకు ఆకర్షించుకుంటాడని అర్థం (ప్రకటన గ్రంథం 7:9).

33. తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.

మొదటినుంచీ కూడా తాను సిలువపై మరణిస్తానని ఆయనకు తెలుసు.

34. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
కీర్తనల గ్రంథము 89:4, కీర్తనల గ్రంథము 89:36, కీర్తనల గ్రంథము 110:4, యెషయా 9:7, దానియేలు 7:14

వారు బహుశా కీర్తనల గ్రంథము 89:36; కీర్తనల గ్రంథము 110:4; యెషయా 9:7; దానియేలు 7:14 వంటి వచనాల గురించి అడుగుతున్నారు. యేసు తనను తాను తరచుగా “మానవ పుత్రుడు” అంటున్నాడని వారికి తెలుసు. ఈ పేరుకు అర్థమేమిటో అనీ పాత ఒడంబడిక గ్రంథంలో చెప్పిన అభిషిక్తుడే ఈ మానవ పుత్రుడా అనీ సందేహించారు. “మానవ పుత్రుడు” గురించి నోట్ మత్తయి 8:20.

35. అందుకు యేసుఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.

“వెలుగు”– అంటే తానే అని ప్రభువు ఉద్దేశం. వ 46; యోహాను 8:12; యోహాను 9:5. అంతటా చాలామంది ప్రజల విచారకరమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది – వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు.

36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

అంటే క్రీస్తుపై నమ్మకం ఉంచి “వెలుగు” అయి ఉన్న దేవుని పిల్లలుగా మారాలని దీని అర్థం (1 యోహాను 1:5). వెలుగు అయి ఉన్న క్రీస్తును స్వీకరించి ఆయన పేరుమీద నమ్మకం పెట్టుకోవడం ద్వారా మాత్రమే ఎవరైనా దేవుని పిల్లలు కాగలరు (యోహాను 1:12-13). “వెలుగు సంతానం” అనేమాట వెలుగు లక్షణం ఉన్నవారినీ, వెలుగులోకి వచ్చి వెలుగును అమూల్యమైనదిగా భావించేవారనీ, వెలుగును ఇతరులకు అందించేవారినీ సూచిస్తున్నది. మత్తయి 5:14-16; ఎఫెసీయులకు 5:8; 1 థెస్సలొనీకయులకు 5:5 పోల్చి చూడండి.

37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.

శుభవార్త పుస్తకాలన్నిటిలో అనేకమంది యూదుల అపనమ్మకం కనబడుతున్నది. క్రీస్తు వారికి చూపిన సాక్ష్యాధారాలూ రుజువులూ ఏవీ వారిని నమ్మించలేకపోయాయి. వారి అపనమ్మకానికి అర్థం లేదు. ఇది చాలా వింతగా విపరీతంగా ఉంది. అయితే ఇక్కడ దానికొక కారణం కనిపిస్తున్నది. వారు పాత ఒడంబడికలోని భవిష్యద్వాక్కులను నెరవేరుస్తున్నారు. యెషయా 53:1; యెషయా 6:10 చూడండి. వారి అపనమ్మకం వారి పాపాలకు దేవుని తీర్పు. ఆ జాతి ఇంతకుముందు ఎప్పుడో అపనమ్మకం మార్గాన్ని ఎన్నుకున్నది. దేవుడిప్పుడు వారిని ఆ మార్గంలో విడిచిపెట్టాడు. మత్తయి 13:14-15 నోట్ చూడండి.

38. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువుయొక్క బాహువు ఎవనికి బయలుపరచ బడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.
యెషయా 53:1

39. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా

40. వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.
యెషయా 6:9-10

41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.

యెషయా 6:1-3 లో తాను ప్రభువును (హీబ్రూలో “యెహోవా”) చూశాననీ, భూమి అంతా ప్రభువు (“యెహోవా”) మహిమతో నిండి ఉందనీ యెషయా రాశాడు. ఇక్కడ యెషయా యేసు మహిమను చూశాడని యోహాను రాస్తున్నాడు. అంటే యేసు యెహోవాదేవుని అవతారం అన్నమాట. యోహాను 8:24, యోహాను 8:58; యోహాను 10:11; లూకా 2:11 మొ।। కూడా చూడండి.

42. అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.

వీరి నమ్మకం నిజమైనదేనా? బహుశా నిజ విశ్వాసం అంకురం వారిలో ఉందేమో. అది తరువాత మొలకెత్తి వారిని మరింత ధైర్యవంతులుగా చేసిందేమో. అయితే నమ్మకం ఉంచామని చెప్పుకుంటూ భయానికి లొంగిపోతూ, మనుషుల మెప్పుదల కోసం ఆశించేవారిని చూచి వారి గురించి సందేహించకుండా ఉండలేము.

43. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.

44. అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.

తండ్రి అయిన దేవునితో తన ఐక్యతను ఇంతకన్నా స్పష్టంగా యేసు వెల్లడించగలడా? యోహాను 10:30; యోహాను 14:9 పోల్చి చూడండి. యేసును నమ్మడమంటే దేవుణ్ణి నమ్మడమే. ఆయన్ను చూస్తే దేవుణ్ణి చూచినట్టే.

45. నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.

46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

వ 35,36; యోహాను 8:12; యోహాను 9:5. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మత్తయి 5:17 నోట్ చూడండి.

47. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని.

యోహాను 3:17.

48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.

చివరి రోజు అంటే దేవుడు నియమించిన తీర్పు రోజు. మత్తయి 10:15 నోట్‌లో రిఫరెన్సులు చూడండి. ఆ సమయంలో తెరిచే పుస్తకాల్లో (ప్రకటన గ్రంథం 20:12) ఒకదానిలో క్రీస్తు చెప్పిన మాటలు ఉంటాయన్నమాట. అంటే ఈ నాలుగు శుభవార్తల్లో మనం చూస్తున్న మాటలు, వాటి ప్రకారం మనం ప్రవర్తించకపోతే మనమీదికి మనమే శిక్ష తెచ్చిపెట్టుకున్న వారమౌతాం. యోహాను 7:21-23 పోల్చి చూడండి.

49. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.

యోహాను 5:19; యోహాను 4:34 పోల్చి చూడండి. యేసుప్రభువు ఉపదేశాలన్నీ దేవుడు నియమించిన ఖచ్చితమైన మాటల్లో, భాష తీరులో, వ్యక్తీకరణలో ఉన్నాయి. వాటిని ఎదిరించబూనుకునే వాడు వాటిని ఇచ్చిన ఏకైక నిజ దేవునితోనే పోరాడుతున్నాడన్న మాట.

50. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.

“శాశ్వత జీవం”– ఈ శుభవార్త అంతటా కొనసాగే ముఖ్యాంశం జీవం (యోహాను 1:4; యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 4:14; యోహాను 5:24; యోహాను 6:47; యోహాను 10:10). తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన మాటలనే అక్షరాలా మాట్లాడేందుకు క్రీస్తు జాగ్రత్త వహించాడు. ఆ మాటల్లో వెలిబుచ్చిన అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రీస్తు బహిరంగ పరిచర్యలో ఆయన పలికిన ఆఖరు పలుకులివి. ఆయన చెప్పిన మాటలన్నిటిపై ఇవి దేవుని అధికార ముద్ర వేస్తున్నాయి. దేవుని వాక్కు ఆయనే (యోహాను 1:1), ఆయన దేవుని వాక్కులనే పలికాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మేరీచే అభిషేకించబడిన క్రీస్తు. (1-11) 
క్రైస్ట్ ఇంతకుముందు మార్తా సేవ చేయడంలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. అయినప్పటికీ, ఆమె సేవ చేయడం మానేయలేదు, కొంతమందికి భిన్నంగా, ఒక తీవ్రమైన విషయంలో నిందలు వచ్చినప్పుడు, వ్యతిరేక తీవ్రతకు వెళ్లడం ద్వారా ప్రతిస్పందిస్తారు. మార్తా సేవ చేస్తూనే ఉంది, కానీ ఇప్పుడు ఆమె క్రీస్తు దయగల మాటలను వినగలిగేంతలోనే చేసింది. దీనికి విరుద్ధంగా, మేరీ క్రీస్తు పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది, ఆమె మరియు ఆమె కుటుంబం పట్ల అతని ప్రేమ యొక్క నిజమైన టోకెన్‌లను పరస్పరం ప్రతిస్పందించింది. దేవుని అభిషిక్తుడు మనచేత కూడా అభిషేకించబడుట యుక్తము. దేవుడు ఇతరులకు మించిన ఆనంద తైలాన్ని అతనికి ప్రసాదించినట్లయితే, మన ప్రగాఢమైన ఆప్యాయతలను ఆయనపై కుమ్మరిస్తాము.
జుడాస్, అయితే, సహేతుకమైన సాకుతో పాపపు చర్యను దాచిపెట్టాడు. మనకు ఇష్టమైన పద్ధతిలో సేవ చేయని వారు ఆమోదయోగ్యమైన సేవను అందించడం లేదని మనం భావించకూడదు. డబ్బుపై వ్యాపించిన ప్రేమ ఒకరి హృదయాన్ని దొంగిలించడంతో సమానం. క్రీస్తు కృప పవిత్రమైన పదాలు మరియు చర్యలను ఉదారంగా వివరిస్తుంది, లోపాలను ఉత్తమంగా చేస్తుంది మరియు సద్గుణాలను పెంచుతుంది. అవకాశాలు, ముఖ్యంగా క్షణికావేశానికి గురయ్యే అవకాశం ఉన్న వాటిని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి మరియు ఉపయోగించుకోవాలి.
అద్భుతం యొక్క నిరంతర ప్రభావాన్ని అడ్డుకోవడానికి లాజరస్ మరణాన్ని పన్నాగం చేయాలనే నిర్ణయంలో ప్రదర్శించబడిన దుష్టత్వం, దుర్మార్గం మరియు మూర్ఖత్వం దేవునికి వ్యతిరేకంగా మానవ శత్రుత్వం యొక్క నిరాశాజనకంగా మాత్రమే అర్థం చేసుకోవచ్చు. ప్రభువు తిరిగి బ్రతికించిన వ్యక్తిని చంపాలని వారు నిశ్చయించుకున్నారు. సువార్త యొక్క విజయం తరచుగా దుష్ట వ్యక్తులలో తీవ్రమైన కోపాన్ని రేకెత్తిస్తుంది, వారు సర్వశక్తిమంతుడిపై విజయం సాధించగలరని నమ్ముతున్నట్లుగా వారు మాట్లాడతారు మరియు ప్రవర్తిస్తారు.

అతను జెరూసలేంలోకి ప్రవేశించాడు. (12-19) 
జెరూసలేంలోకి క్రీస్తు విజయవంతమైన ప్రవేశం సువార్తికులందరిచే నమోదు చేయబడింది. దేవుని బోధనలు మరియు దైవిక ప్రణాళికలో అనేక లోతైన అంశాలు, శిష్యులు మొదట్లో దేవుని విషయాలను ఎదుర్కొన్నప్పుడు వారి గ్రహణశక్తిని తరచుగా తప్పించుకుంటాయి. క్రీస్తు రాజ్యం యొక్క ఆధ్యాత్మిక సారాంశం యొక్క సరైన అవగాహన, దానిని సూచించే లేఖనాలను తప్పుగా అర్థం చేసుకోకుండా మనలను కాపాడుతుంది.

గ్రీకులు యేసును చూడటానికి దరఖాస్తు చేసుకుంటారు. (20-26) 
పవిత్రమైన ఆచారాలలో, ముఖ్యంగా సువార్త పస్కాలో పాల్గొంటున్నప్పుడు, యేసును ఎదుర్కోవాలని - ఆయనను మన స్వంత వ్యక్తిగా భావించాలని, ఆయనతో సంబంధాన్ని కొనసాగించాలని మరియు ఆయన సన్నిధి నుండి దయను పొందాలని మన లోతైన కోరిక ఉండాలి. అన్యజనులను చేర్చుకోవడం విమోచకుడిని కీర్తించింది. వృద్ధిని పొందాలంటే గోధుమ గింజను నాటాలి, క్రీస్తు మానవ రూపాన్ని తీసుకోకుండానే తన ఖగోళ వైభవాన్ని నిలుపుకున్నాడు. ప్రత్యామ్నాయంగా, మానవ స్వభావాన్ని కలిగి ఉన్నందున, అతను తన దోషరహిత ధర్మం ద్వారా మాత్రమే స్వర్గానికి చేరుకోగలడు, బాధలు లేదా మరణం లేకుండా. అయితే, అటువంటి దృష్టాంతంలో, మానవ జాతి నుండి ఏ పాపమూ మోక్షాన్ని అనుభవించలేదు. పూర్వం మరియు ఇప్పటి నుండి చివరి వరకు ఆత్మలను రక్షించడం ఈ గోధుమ గింజను త్యాగం చేయడానికి కారణమని చెప్పవచ్చు. క్రీస్తు మన మహిమ యొక్క నిరీక్షణా కాదో తెలుసుకోవడానికి ఆత్మపరిశీలన చేసుకుందాం; మనం ప్రభువైన యేసును ఇష్టపూర్వకంగా సేవిస్తూ, ఆయన పవిత్రమైన మాదిరిని అనుకరించటానికి ఈ జీవితంలోని అల్పమైన విషయాల పట్ల మనలో ఉదాసీనతను కలిగించమని ఆయనను వేడుకుందాం.

స్వర్గం నుండి ఒక స్వరం క్రీస్తుకు సాక్ష్యంగా ఉంది. (27-33) 
క్రీస్తు మనలను విమోచించి రక్షించే పనిని చేపట్టినప్పుడు మన ఆత్మల పాపం అతని ఆత్మను కలవరపెట్టింది, మన పాపాలకు అతని ఆత్మను అర్పణగా చేసింది. క్రీస్తు బాధలను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అతను దాని నుండి తప్పించుకోమని ప్రార్థించాడు. ఇబ్బందికి వ్యతిరేకంగా ప్రార్థించడం దాని సమయంలో సహనంతో మరియు దాని మధ్యలో దేవుని చిత్తానికి లొంగిపోవచ్చు. మన ప్రభువైన యేసు దేవుని బాధించిన గౌరవాన్ని సంతృప్తి పరచడానికి కట్టుబడి ఉన్నాడు, దానిని తన స్వంత వినయం ద్వారా సాధించాడు. స్వర్గం నుండి వచ్చిన తండ్రి స్వరం, గతంలో అతని బాప్టిజం మరియు రూపాంతరం సమయంలో అతనిని ప్రియమైన కుమారుడిగా ప్రకటించాడు, ఇప్పుడు అతను తన పేరును మహిమపరిచాడని మరియు దానిని కొనసాగిస్తాడని ప్రకటించాడు.
తన మరణం యొక్క యోగ్యత ద్వారా ప్రపంచాన్ని దేవునితో సమాధానపరచడంలో, క్రీస్తు మరణం యొక్క శక్తిని విచ్ఛిన్నం చేశాడు మరియు సాతానును విధ్వంసకుడిగా బహిష్కరించాడు. తన సిలువ బోధల ద్వారా ప్రపంచాన్ని దేవుని వద్దకు తీసుకురావడం ద్వారా, అతను పాపం యొక్క శక్తిని విచ్ఛిన్నం చేశాడు మరియు సాతానును మోసగాడిగా వెళ్లగొట్టాడు. ఒకప్పుడు క్రీస్తు ప్రభావానికి దూరంగా ఉన్నవారు ఆయనను ప్రేమిస్తారు మరియు విశ్వసిస్తారు. యేసు పరలోకానికి ఆరోహణమైనప్పుడు, ప్రజల హృదయాలను తన వైపుకు ఆకర్షించాడు. క్రీస్తు మరణం ఆత్మలను అతని వైపుకు ఆకర్షించే శక్తిని కలిగి ఉంది. సువార్త ఉచిత దయ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసింది మరియు విధిని కూడా నొక్కి చెప్పింది; రెండింటినీ వేరు చేయకుండా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం చాలా అవసరం.

ప్రజలతో అతని ఉపన్యాసం. (34-36) 
లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుంటూ, ప్రజలు క్రీస్తు బాధలు మరియు మరణం గురించిన ప్రవచనాలను పట్టించుకోకుండా సరికాని ఆలోచనలను ఏర్పరచుకున్నారు. మన ప్రభువు కాంతి వారితో ఎక్కువ కాలం ఉండదని వారిని హెచ్చరించాడు మరియు చీకటి వారిని చుట్టుముట్టకముందే దానిని స్వీకరించమని వారిని ప్రోత్సహించాడు. వెలుగులో నడవాలంటే, దానిని విశ్వసించాలి మరియు క్రీస్తు మార్గదర్శకత్వాన్ని పాటించాలి. అయితే, విశ్వాసం లేనివారు యేసు సిలువపై ఎత్తబడడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించలేరు మరియు పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడి చేయబడిన దాని రూపాంతర ప్రభావం గురించి తెలియదు. తమ అవిశ్వాసాన్ని సమర్థించుకోవడానికి వారు అనేక అభ్యంతరాలను లేవనెత్తారు.

యూదుల అవిశ్వాసం. (37-43) 
ఇక్కడ వివరించిన మార్పిడి ప్రక్రియను పరిగణించండి. పాపులు దైవిక విషయాల యొక్క వాస్తవికతను గుర్తించి, వాటి గురించి కొంత అవగాహన పొందుతారు. పరివర్తనలో పాపం నుండి క్రీస్తు వైపు తిరగడం, ఆయనను తమ ఆనందానికి మూలంగా మరియు అంతిమ భాగంగా గుర్తించడం. దేవుడు, ఈ మార్పిడిలో, వైద్యం చేసేవాడు, సమర్థించేవాడు మరియు పవిత్రుడుగా వ్యవహరిస్తాడు. అతను వారి పాపాలను క్షమిస్తాడు, రక్తస్రావం గాయాలుగా చిత్రీకరించబడ్డాడు మరియు ప్రచ్ఛన్న వ్యాధులతో పోల్చబడిన వారి అవినీతిని అణచివేస్తాడు.
ఇతరుల నుండి ప్రశంసలు లేదా విమర్శలను పొందడం గురించిన ఆందోళనల కారణంగా నేరారోపణలను అణచివేయడంలో ప్రపంచం యొక్క ప్రభావాన్ని ఈ ప్రకరణం హైలైట్ చేస్తుంది. మానవ ఆమోదం కోసం కోరిక, అకారణంగా ధర్మబద్ధమైన చర్యలలో ద్వితీయ ఉద్దేశ్యంగా ఉపయోగించినప్పుడు, మతం ప్రజాదరణ పొందినప్పుడు వంచనకు దారి తీస్తుంది మరియు క్రెడిట్ పొందవలసి ఉంటుంది. అదేవిధంగా, తప్పుడు కార్యకలాపాలలో అవినీతి సూత్రంగా పురుషుల నుండి ప్రశంసలు పొందడం అనేది మతం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మతభ్రష్టుడిగా మార్చగలదు మరియు దాని కోసం సామాజిక స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంది.

వారికి క్రీస్తు చిరునామా. (44-50)
మన ప్రభువు తనను విశ్వసించే వారెవరైనా, ఆయనను నిజమైన శిష్యునిగా గుర్తించి, ఆయనపై మాత్రమే కాకుండా, తనను పంపిన తండ్రిపై కూడా విశ్వాసం ఉంచుతారని మన ప్రభువు బహిరంగంగా ప్రకటించాడు. మనం యేసును చూస్తూ, ఆయనలోని తండ్రి మహిమను గుర్తించినప్పుడు, ఆయనకు విధేయత చూపడానికి, ప్రేమించడానికి మరియు విశ్వసించడానికి మనం మొగ్గు చూపుతాము. ప్రపంచంలోకి వెలుగుగా వచ్చిన వ్యక్తిని నిరంతరం ధ్యానించడం ద్వారా, అజ్ఞానం, దోషం, పాపం మరియు దుఃఖం అనే చీకటి నుండి క్రమంగా బయటపడతాము. మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ నిత్యజీవానికి దారితీస్తుందని మనం అర్థం చేసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ, అదే పదం దానిని తిరస్కరించే లేదా నిర్లక్ష్యం చేసేవారికి తీర్పుగా ఉపయోగపడుతుంది.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |