John - యోహాను సువార్త 11 | View All

1. మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.

లాజరు అనే పేరు ఎలియాజరు అనే పేరులోనుంచి వచ్చింది. దీని అర్థం “దేవుడు సహాయం చేశాడు”. జెరుసలంకు తూర్పు దిక్కున ఆలీవ్ కొండపై బేతనీ గ్రామం ఉంది.

2. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.

యోహాను 12:3. శుభవార్తల్లో మరియ అనే పేరున్న స్త్రీలు కొందరు కనిపిస్తారు – యోహాను 19:25; మత్తయి 1:18; మత్తయి 27:56.

3. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.

కష్టకాలంలో విశ్వాసులంతా చేయవలసినది ఇదే. యేసుకు ఈ కుటుంబ సభ్యులంతా బాగా తెలుసు. వారిపట్ల ఆయన ప్రత్యేక వాత్సల్యం చూపించాడు. లాజరు అక్కచెల్లెళ్ళు అతని పేరును కూడా యేసుకు చెప్పనవసరం లేదు.

4. యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.

యేసు ప్రత్యేకంగా అభిమానించిన వ్యక్తికి కూడా జబ్బు చేసింది చూడండి. ప్రభువు ఆ వ్యాధిని రాకుండా చేయలేదు, అంతకు ముందు ఆయన అనేక వ్యాధులను బాగుచేసినా అతణ్ణి బాగు చెయ్యలేదు. యోబు 2:4-8; 2 కోరింథీయులకు 12:7-10; 1 తిమోతికి 5:23; 2 తిమోతికి 4:20 కూడా చూడండి. “మహిమ కలిగేలా”– మత్తయి 9:3 పోల్చి చూడండి. దేవుని కుమారునికి మహిమ కలిగితే దేవునికి మహిమ కలుగుతుందని గమనించండి. లాజరు మరణం యేసుప్రభువు తన కృప, ప్రభావాలను ప్రదర్శించేందుకు మరో అవకాశం అతణ్ణి తిరిగి బ్రతికించడమనే మహా అద్భుతం. ఆయన దేవుని కుమారుడైన అభిషిక్తుడనడానికి మరో సూచన (యోహాను 2:11).

5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.

6. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.

యేసుప్రభువుకు వారంటే ప్రేమ ఉన్నప్పటికీ వారికి సహాయం చేసేందుకూ ఓదార్చేందుకూ పరుగెత్తుకుంటూ వాళ్ళ ఊరు వెళ్ళలేదు. అంతకన్నా శ్రేష్ఠమైన కార్యం ఒకటి, దానికి అనువైన సమయంలో చేయాలని ఆయన మనస్సులో ఉంది. తమ సమస్యను ఆయన చేతుల్లో వదిలి ఆయన సమయం కోసం ఎదురు చూచేవాళ్ళకు సరైన సమయంలో తమకు లభించగల అన్ని మేలుల్లోకీ గొప్ప మేలు ఆయన్నుంచి లభిస్తుంది. ప్రభువు ఆలస్యం చేస్తున్నాడంటే మన మనవి నిరాకరించాడని కాదు. ఆయన ఉద్దేశంలో అందుకు మంచి కారణాలు ఉండబట్టి కొన్ని సార్లు మనల్ని బాధలు పడనిస్తాడు (2 కోరింథీయులకు 4:17; 2 కోరింథీయులకు 12:7-10; ప్రకటన గ్రంథం 2:10; యోబు 3:20). లాజరు విషయంలో ఆయన ఇలా జాగుచేయడం బహుశా అతని అక్కచెల్లెళ్ళకూ, తన శిష్యులకూ విశ్వాస పరీక్షగా ఆయన ఉద్దేశించాడేమో. 1 పేతురు 1:6-7.

7. అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా

జెరుసలం ముఖ్య పట్టణంగా ఉన్న ప్రాంతం యూదయ.

8. ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.

“గురువర్యా”– యోహాను 1:38.

9. అందుకు యేసు పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.

యోహాను 9:4; యోహాను 12:35 పోల్చి చూడండి. ఒక పనిని పూర్తి చేయడానికి దేవుడు ఒక సమయాన్ని నియమిస్తాడు; దేవుడిచ్చిన వెలుగులో నడుచుకునేవారు దేనికీ భయపడనవసరం లేదు; తాను చేస్తున్నదేమిటో తనకు బాగా తెలుసు; వెలుగులో ఆయనతోబాటు వారు సాగిపోవాలి అని యేసు ఇక్కడ చెప్తున్నాడు.

10. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.

11. ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా

“స్నేహితుడు”– యోహాను 15:14-15 చూడండి. ఇక్కడ “నిద్రపోయాడు” అంటే అర్థం “చనిపోయాడు” (వ 14). శరీరం మరణించడానికి పాత, క్రొత్త ఒడంబడిక గ్రంథంలో రెండు పుస్తకాలలోనూ ఈ విధంగా వర్ణించడం జరిగింది (ద్వితీయోపదేశకాండము 31:16; దానియేలు 12:2; మత్తయి 27:52; అపో. కార్యములు 7:60; అపో. కార్యములు 13:36; 1 కోరింథీయులకు 7:39; 1 కోరింథీయులకు 11:30; 1 కోరింథీయులకు 15:6-18; 1 థెస్సలొనీకయులకు 4:13-14. ఈ తర్జుమాలో సాధారణంగా ఇది “కన్ను మూయడం” అని అనువదించాం). ఈ మాట మరణం తరువాతి జీవితం, మరణించినవారి మధ్యనుంచి లేవడం అనేవాటిని సూచిస్తున్నది – నిద్రపోయిన వారు తెల్లారినప్పుడు తిరిగి లేస్తారు గదా (దానియేలు 12:2). ఈ సందర్భంలో నిద్రపోవడం అంటే చనిపోయినవారికి స్పృహ, చైతన్యం ఉండదని అర్థం కాదు – లూకా 16:22-26; ప్రకటన గ్రంథం 6:9-10 చూడండి. నిద్రపోయేది ఆత్మ కాదు దేహమే. “మేల్కొలపడానికి” అంటే చనిపోయినవాణ్ణి తిరిగి సజీవంగా లేపడానికి అని అర్థం.

12. శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.

ఇంతకుముందు తరచుగా జరిగినట్టుగానే మనుషులు యేసు మాటలను అక్షరాలా తీసుకుని వాటిని పొరపాటుగా అర్థం చేసుకున్నారు.

13. యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.

14. కావున యేసు లాజరు చనిపోయెను,

యోహాను 3:4; యోహాను 4:11, యోహాను 4:15, యోహాను 4:32; యోహాను 6:52; మత్తయి 16:6 పోల్చి చూడండి. క్రీస్తుకున్న మానవాతీతమైన జ్ఞానానికి మరో ఉదాహరణ. లాజరుకు జబ్బు చేసిందని మాత్రమే ఆయనకు కబురు వచ్చింది. కానీ అతడు చనిపోయాడని యేసుకు తెలుసు. యోహాను 1:48-50; యోహాను 2:24-25 కూడా చూడండి.

15. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.

యేసుప్రభువు ఒక మహా అద్భుతాన్ని చేయనున్నాడు. దాని ఫలితంగా ఆయన శిష్యుల నమ్మకం అభివృద్ధి చెందుతుంది. సంతోషించడానికి కారణం ఇదే గానీ లాజరు చనిపోవడం కాదు.

16. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.

“తోమా”– మత్తయి 10:3. “దిదుమ” అన్నా “తోమా” అన్నా అర్థం ఒకటే – “కవల”. యేసు గనుక యూదయ ప్రాంతానికి తిరిగి వెళ్తే తప్పక హతమౌతాడనీ ఆయనతోబాటు తాము కూడా హతమవుతామన్న విషయంలో ఇతడికి ఏమాత్రం సంశయం ఉన్నట్టు లేదు. ప్రతిదానిలోనూ కీడు ఉందేమో అని తలంచే స్వభావం ఇతనిది. నమ్మకం ఉంచవలసిన సందర్భంలో సందేహించే మనస్తత్వం అతనికి ఉంది. (యోహాను 14:5; యోహాను 20:24-27).

17. యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.

లాజరు అక్కచెల్లెళ్ళు యేసుకు వార్త పంపిన కొద్ది సమయానికి లాజరు చనిపోయి ఉండాలి (వ 3). వార్త యేసుకు చేరడానికి ఒక రోజు పట్టి ఉంటుంది. ప్రయాణం కట్టకముందు ఆయన రెండు రోజులు ఆగాడు. ప్రయాణమై బేతనీ చేరడానికి మరో రోజు పట్టింది.

18. బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము

19. గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.

ఈ కుటుంబం ఊళ్ళో మంచి పరువు మర్యాదలుగల కుటుంబం అయి ఉండాలి.

20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.

ఇద్దరిలోనూ మార్త చురుకైనది. మరియ నెమ్మదిగా ఉండేది (లూకా 10:38-42).

21. మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.

యేసు గనుక అక్కడున్నట్టయితే లాజరును బాగుచేసి ఉండేవాడే అని ఆమె ఉద్దేశం. లాజరు విషయంలో ఇది నిజమో కాదో చెప్పలేము. అందరి విషయంలోనూ ఇది నిజం కాదని మనకు తెలుసు. ప్రభువు ఎప్పుడూ తన విశ్వాసులతో ఉండేవాడు (మత్తయి 28:20), నిజంగా వారిలో ఉండేవాడు (యోహాను 17:23; 2 కోరింథీయులకు 13:5; కొలొస్సయులకు 1:27). అయినప్పటికీ ఇన్ని శతాబ్దాలుగా వారంతా చనిపోతూనే ఉన్నారు. వారిలో అనేకులు చాలా నొప్పులు, ఆయా వ్యాధులతో బాధపడుతూ చనిపోయారు.

22. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.

ప్రభువు ఆశ్చర్య క్రియలు చేయగలడని ఆమెకు తెలుసు. కానీ ఆ సమయంలో ఆయన లాజరును సజీవంగా లేపుతాడని ఆమె అనుకున్నదా అన్నది సందేహమే. వ 39 చూడండి. చనిపోయిన వారందరూ తిరిగి లేచే రోజున లాజరు లేస్తాడని ఆమె నమ్మింది (వ 24). అయితే అది వేరే విషయం. యేసు ఒకవేళ లాజరును బ్రతికిస్తాడేమోనన్న ఆలోచన ఆమెలో మొలకెత్తడానికి ప్రయత్నిస్తూ ఉండగా, దాన్ని నమ్మడానికి ఆమె కొట్టుమిట్టాడుతున్నదేమో. 23,25,26 వచనాల్లో ఆమెతో యేసు చెప్పిన మాటలు దాన్ని నమ్మేందుకు ఆమెను ప్రోత్సహించడం కోసమేమో.

23. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా

24. మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.
దానియేలు 12:2

25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

యోహాను 5:21-29 చూడండి. యేసుప్రభువులో సాక్షాత్తూ దేవుని జీవం ఉంది. విశ్వాసుల జీవం ఆయనే (కొలొస్సయులకు 3:3-4). ఆయనలో, ఆయనలో మాత్రమే మనుషులు శాశ్వత జీవాన్ని పొందగలరు (యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 6:53-54; యోహాను 14:6). పునర్జీవితం ఆయనే. పునర్జీవితం అంటే పునర్జన్మ కానే కాదు. పునర్జన్మ అనే సిద్ధాంతం బైబిలు ఉపదేశానికి విరుద్ధం. యోహాను 9:3 నోట్ చూడండి. తనకు ఇష్టమైనప్పుడు ఎవరినైనా, తనను సహా సజీవంగా లేపే అధికారం, శక్తి తనకున్నదని ఆయన చెప్తున్నాడు (యోహాను 5:21; యోహాను 10:17-18). క్రీస్తులో విశ్వాసులు దేవుని సన్నిధిలో అనంత కాలం జీవిస్తారు (యోహాను 14:3; 1 థెస్సలొనీకయులకు 4:17). వారికి మరణం జీవితానికి అంతం కాదు. మరింత శ్రేష్ఠమైన జీవితానికి అది ఆరంభం మాత్రమే (2 కోరింథీయులకు 5:6-8; ఫిలిప్పీయులకు 1:21-23).

26. బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

యోహాను 5:24; యోహాను 6:50-51. విశ్వాసులు శరీర సంబంధంగా మరణిస్తారు గాని శాశ్వతంగా జీవిస్తారు. ఆత్మ సంబంధమైన మరణం (ఎఫెసీయులకు 2:1) వారిని ఎన్నడూ తాకదు. తనమీద నమ్మకం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో యేసు నొక్కి చెప్తున్న సంగతి మళ్ళీ గమనించండి. యోహాను 3:15-16, యోహాను 3:18; యోహాను 6:40; యోహాను 8:24; యోహాను 10:37-38 చూడండి.

27. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.

“దేవుని కుమారుడు”– యోహాను 1:34, యోహాను 1:49; యోహాను 6:68; యోహాను 20:31; మత్తయి 3:17; మత్తయి 16:16. మార్తకున్న నమ్మకం నిజమైనది, స్థిరమైనది. “అభిషిక్తుడు”– మత్తయి 1:1.

28. ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్య ముగా పిలిచెను.

29. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.

30. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను

మరియను ఒంటరిగా కలుసుకుని ఓదార్చి ఆమె నమ్మకాన్ని ప్రోత్సహించాలని ప్రభువు అక్కడ ఉండిపోయి నట్టుంది. కానీ యూదులు ఆమె వెంట రావడంతో అందుకు ఎక్కువ సమయం లేకపోయింది.

31. గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.

32. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.

వ 21. వ్యాధి నయం కావాలంటే యేసు శారీరికంగా ఆ ప్రదేశంలో ఉండాలన్నట్టు మార్త, మరియ ఇద్దరూ మాట్లాడారు. కానీ యోహాను 4:47-53; మత్తయి 8:5-13 చూడండి.

33. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా,

ఆయన అంత పరితపించడం, అంత ఆందోళన చెందడం ఎందుకు? బహుశా బాధపడుతున్న తన స్నేహితుల దుఃఖాన్ని సంపూర్ణంగా ఆయన పంచుకున్నాడేమో (యెషయా 63:9 పోల్చి చూడండి). బహుశా లాజరు భవిష్యత్తులో మరోసారి చనిపోయేలా అతడు ఉన్న ప్రశాంత స్థితినుండి వెనక్కు తీసుకురావాలని అతడి గురించి దుఃఖపడ్డాడేమో. లేక ఒకవేళ యేసు మరణం గురించీ అది పాపం మూలంగా లోకంలో ఎలా ప్రవేశించిందీ, శత్రువుగా మానవ జాతినంతటినీ ఎలా అణగద్రొక్కి బానిసలుగా చేసుకున్నదీ (రోమీయులకు 5:12, రోమీయులకు 5:21; హెబ్రీయులకు 2:14-15) ఆలోచిస్తున్నాడేమో. లేక మరణమనే ఈ శత్రువును ఓడించేందుకు త్వరలో తాను చెల్లించబోయే వెలను – అంటే లోక పాపాల కోసం సిలువపై ఘోర యాతనతో తాను మరణించవలసిన సంగతి గుర్తు చేసుకుంటున్నాడేమో. లేక తన బలి అర్పణవల్ల ఎలాంటి లాభమూ పొందకుండా పాపంలోనే చనిపోయి శాశ్వతంగా నశించిపోయే అనేకమందిని గురించి తలపోస్తున్నాడేమో. ఒకవేళ ఈ సమయంలో లాజరు సజీవంగా లేవాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాడేమో (వ 41). ఆయన ప్రార్థనలు చల్లగా నిర్లిప్తంగా ఉండవు (హెబ్రీయులకు 5:7 పోల్చి చూడండి. విశ్వాసుల కోసం క్రీస్తు ఆత్మ చేస్తున్న ప్రార్థనలు కూడా పోల్చి చూడండి – రోమీయులకు 8:27).

34. వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.

ఇలా అడగడంలో యేసుకు తెలియదని కాదు. ఆయనకున్న మానవాతీతమైన జ్ఞానానికి ఉదాహరణ వ 14లో చూడండి. ఆదికాండము 3:9 లో దేవుడు ఆదామును అడిగిన ప్రశ్న గమనించండి.

35. యేసు కన్నీళ్లు విడిచెను.

బైబిల్లో అన్నిటికన్నా చిన్న వచనం ఇది. కానీ భావంలో మాత్రం పెద్ద వచనాల్లో ఒకటి. విశ్వాన్ని చేసినవాడు, మనుషుల ముక్తి ప్రదాత సానుభూతీ కదలికా వ్యక్తిత్వమూ లేని రాతిగుండె దైవం కాడు. ఆయన ప్రేమిస్తాడు, మన బాధల్ని పట్టించుకుంటాడు, మనుషుల కష్టాల్లో వారి గురించి రోధిస్తాడు (లూకా 22:41-44; యిర్మియా 48:31-32; నిర్గమకాండము 2:24-25).

36. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.

37. వారిలో కొందరుఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.

వ 21,32. వారంతా అన్నది నిజమే. యేసు లాజరును చనిపోకుండా ఉంచగలిగేవాడే. అయితే ఆయన మదిలో వేరొక ఉద్దేశం ఉంది (వ 4). అది వారికింకా అర్థం కాలేదు.

38. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.

వ 33.

39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.

లాజరును సజీవంగా లేపినవాడు సమాధి రాయి దానంతట అది దొర్లిపోయేలా కూడా చేయగలడు. అయితే చనిపోయిన వ్యక్తిని లేపడంలో వారిని కూడా కొద్దిగా చెయ్యి వెయ్యనిచ్చాడు. ఆ రాయిని తాము తొలగించామనీ ఆ రాయి మూసి ఉన్న సమాధిలో లాజరు మృతదేహం ఉందనీ వారు తరువాత సాక్ష్యం చెప్పగలరు. యేసు చెయ్యబోతున్నది మార్తకు అర్థం కాలేదన్నది స్పష్టం. అందుకనే ఆ రాయిని తొలగించడం ఆమెకు అర్థం లేని పనిగా అనిపించింది. లాజరు ఏదో స్మృతి తప్పి మైమరచిన స్థితిలో ఉండడం కాదని, అతడు చనిపోయినది ఖాయమనీ మాత్రం ఆమెకు తెలుసు. శరీరం కుళ్ళిపోవడం కూడా మొదలయింది.

40. అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;

వ 4. ఇంతకుముందు క్రీస్తుకూ మార్తకూ మధ్య జరిగిన సంభాషణలో ఈ మాటలు కనిపించలేదు. అయితే ఆయన అన్న ప్రతి మాటా ఇక్కడ రాసి ఉంది అనుకోలేము. లేక 25,26లోని మాటల గురించి చెప్పాడేమో. ఈ వచనంలో నమ్మకం ముందు, చూడడం తరువాత రావడం గమనించండి. మనుషులు ఈ క్రమాన్ని తలకిందులు చేయాలనుకుంటారు – చూచి నమ్మాలనుకుంటారు – యోహాను 4:48.

41. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

“పైకి చూస్తూ”– యోహాను 17:1. ప్రార్థనలో మనం ఏ భంగిమలో ఉన్నాం అన్నది కాదు గాని హృదయ స్థితే ప్రాముఖ్యం. “విన్నందుచేత”– లాజరు సజీవంగా లేవాలని ఆయన ప్రత్యేకించి ప్రార్థించాడన్నమాట. “కృతజ్ఞత”– మత్తయి 14:19; లేవీయకాండము 7:12-13; కీర్తనల గ్రంథము 7:17; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనీకయులకు 5:18.

42. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.

యేసు తండ్రియైన దేవుని సంకల్పం ప్రకారమే ఎప్పుడూ ప్రార్థించాడు కాబట్టి దేవుడు తన ప్రార్థనలకు ఎప్పుడూ జవాబిచ్చాడని ఆయనకు తెలుసు (1 యోహాను 5:14-15 పోల్చి చూడండి). తన ప్రార్థన విన్నందుకు బహిరంగంగా ఆయన తన తండ్రికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాడంటే అక్కడ నిలిచి ఉన్న యూదులు ఒక ముఖ్యమైన సత్యాన్ని నేర్చుకోవాలి. తాను లాజరును తన స్వశక్తిచేత బ్రతికించడం లేదు, లేక తనకు తానే కోరి అలా చేయడం లేదు. దేవుడు ఆయన్ను పంపాడనడానికి ఆ అద్భుతం ఒక సూచన.

43. ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా

ఆయన బిగ్గరగా పిలిచినది లాజరు వినాలని కాదు, చుట్టూ ఉన్నవారు వినాలని. ఇక్కడ మాయ గానీ ఇంద్రజాలం గానీ మంత్రం గానీ లోలోపల గొణుక్కునే మంత్రవిద్య గానీ లేవు. చనిపోయిన వ్యక్తికి యేసు స్పష్టమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు అంతే. వ యోహాను 5:21-27 లో ఆయన చెప్పిన ప్రకారం చనిపోయినవాడు తిరిగి బ్రతికాడు.

44. చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.

పట్టపగలు అనేకమంది నిలబడి చూస్తుండగా బహిరంగంగా జరిగిన మహా అద్భుతం ఇది. యేసుప్రభువుకు జీవన్మరణాలపై అధికారం ఉందని ఇది వెల్లడి చేస్తున్నది. యోహాను 5:21-27 లో తనకు అలాంటి అధికారం ఉందని ఆయన చెప్పాడు. ఇక్కడ దాన్ని రుజువుపరచాడు. భౌతిక లోకంలో ఆయనకు అధికారం ఉంది. నాలుగు దినాల క్రితం మరణించి కుళ్ళి వాసన గొడుతున్న శరీరంలో ఆయన ప్రాణం పోశాడు. ఆధ్యాత్మిక లోకంలో కూడా ఆయనకు అధికారం ఉంది. చనిపోయిన మనిషి ఆత్మను దాని విశ్రాంతి స్థలం నుంచి వెనక్కు పిలిచి శరీరంలో తిరిగి లీనం చేశాడు. “ఆ కట్లు విప్పి”– తన పనిలో మనుషులకు మరోసారి భాగం ఇచ్చాడు. ఈ విధంగా వారు లాజరుకు దగ్గరగా వచ్చి చూచి అతని శరీరానికి చుట్టిన సమాధి బట్టలు తొలగించి, ఇంతకుముందు కుళ్ళిపోయి ఇప్పుడు ఆరోగ్యవంతంగా తాజాగా ఉన్న అతని దేహాన్ని తాకి చూడవచ్చు. తమ కళ్ళెదుట జరిగినది ఏదో బూటకం లేక మాయ కాదని తెలుసుకోవచ్చు.

45. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని

రుజువును చూచి వారు యేసును నమ్మారు. ఆ వాస్తవాలనుంచి వారు ఎలా తప్పించుకోగలరు? దేవుని బలప్రభావాల్ని ఆయన ప్రదర్శించాడు. అది వారికి తెలుసు.

46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.

కొందరైతే ఈ అద్భుతాన్ని చూచి కూడా యేసును అభిషిక్తుడని ఒప్పుకోలేదు. పరిసయ్యులు ఈ సందర్భంలో ఏం చేస్తారో చూద్దామని వెళ్ళారు. ఇంత బ్రహ్మాండమైన అద్భుతం కూడా పాపంలో బండబారిపోయిన వారి విరోధ భావాన్నీ దురభిమానాన్నీ అపనమ్మకాన్నీ తొలగించలేదు (లూకా 16:31 చూడండి). తరువాత వస్తున్న వచనాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది.

47. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

“సమాలోచన సభ”– మత్తయి 5:22. యేసు సూచనకోసమైన ఈ అద్భుతాలు చేస్తున్నాడని వారు ఒప్పుకున్నారు. వారు కొట్టిపారవేయలేనంత బలంగా సాక్ష్యాధారాలూ రుజువులూ ఉన్నాయి (అపో. కార్యములు 4:15-17 పోల్చి చూడండి). కానీ అవి చూపిస్తున్న దిశకు వెళ్ళడానికి వారికి ఇష్టం లేదు. వారు కోరేది సత్యాన్ని కాదు కాబట్టి ఆ రుజువులు చూపిస్తున్న వైపుకు వెళ్ళలేకపోయారు (యోహాను 5:44 చూడండి). క్రీస్తుమీద నమ్మకం ఉంచమని నిశ్చయించుకున్నవారికి ఎన్ని సాక్ష్యాధారాలు చూపినా ఎంత బలమైన రుజువులున్నా నమ్మరు.

48. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.

క్రీస్తును నిరాకరించేందుకు వారెలాంటి సాకు చెప్తున్నారో చూడండి. వారి భయమేమిటంటే జనమంతా క్రీస్తులో నమ్మకం ఉంచితే వారు ఆయన్ను తమ నాయకుడుగా చేసుకుని రోమ్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేస్తారు (ఆ కాలంలో వారిని పరిపాలిస్తున్నది రోమ్‌వారే). అలాంటప్పుడు రోమ్‌వారు గొప్ప బలగంతో వచ్చి జెరుసలంకు, దేవాలయానికి, జాతి అంతటికీ గొప్ప విధ్వంసాన్ని కలిగిస్తారని వారి భయం. ఈ పరిసయ్యులకు మనుషులంటే భయం గాని దేవుడంటే భయం లేదు. (రోమీయులకు 3:18). ఇలా రోమ్‌వారికి భయపడడంలో అర్థం లేదు. యేసుప్రభువు రాజకీయ నాయకుడుగా ఉండేందుకు ఇంతకుముందే నిరాకరించాడు (యోహాను 6:15). ఆయన రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు (యోహాను 18:36). మనుషుల హృదయాల్లో ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం స్థాపించడం గాని రోమ్‌పై రాజకీయంగా తిరుగుబాటు లేవదీయడం ఆయన ఉద్దేశం కాదు. కానీ ఈ పరిసయ్యుల కపటబుద్ధి, దుర్మార్గత చూడండి. ఆ జాతిని కాపాడేది తామేనని ఒక పక్క చెప్తూనే మరో పక్క దేవుని కుమారుణ్ణి చంపాలని ఆశిస్తున్నారు. చివరికి వారు భయపడినదంతా జెరుసలం మీదికి వచ్చిపడింది. ఆ జాతి యేసుప్రభువుపై నమ్మకం ఉంచినందుకు కాదు, ఆయన్ను తిరస్కరించినందుకే ఇలా జరిగింది. మత్తయి యోహాను 23:37-39; యోహాను 24:1-2; లూకా 19:41-44 చూడండి.

49. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు.

ఆ సందర్భంలో చేయవలసినదేదో వారు గ్రహించలేదని కయప అంటున్నాడు. వారు చేయవలసినదాని గురించి తన అభిప్రాయాన్ని తరువాతి వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు.

50. మన జనమంతయు నశింప కుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

ఇక్కడ తెగువగా తన నిర్ణయాన్ని వినిపిస్తున్నాడు – “ఒకే మనిషి చావడం”– క్రీస్తు రోమ్‌వారిని యూదజాతిపై చర్య తీసుకునేలా రేపే తంటాలమారి అనీ ఆయన్ను చంపడం అవసరం అనీ అతని అభిప్రాయం. పరిసయ్యులకు, పొంతి పిలాతుకు (యోహాను 18:38) సత్యమంటే ఎంత నిర్లక్ష్యం ఉందో ఇతనికీ అంతే.

51. తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక

ఇది చాలా వింతైన విషయం. నమ్మకం, పాపవిముక్తి లేనివాడు, క్రీస్తును తిరస్కరించినవాడు ఆధ్యాత్మిక విషయాన్ని గురించి భవిష్యద్వాక్కు పలికాడు. క్రీస్తు సంఘం ఏర్పడుతుందన్న భవిష్యద్వాక్కు ఇది. ఇలా దేవుని మూలంగా పలికేందుకు దేవుడు అతణ్ణి వాడుకుంటున్నట్టుగా అతనికి తెలియదన్నది స్పష్టం. తన హృదయంలోని అపనమ్మకం, దుర్మార్గతల మూలంగా అతడు ఈ విధంగా పలికాడు. అయితే అతడు ఊహించిన దానికంటే అతడి మాటలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. దేవుని ప్రజలైన ఇస్రాయేల్‌వారి ప్రముఖ యాజిగా అతడు మాట్లాడాడు. దేవుడు తన కుమారుణ్ణి గురించి ఆలోచన చెప్పేందుకు అతని పదవిని బట్టి అతణ్ణి వాడుకున్నాడు. ఆ ఆలోచనవల్ల గొప్ప ఫలితాలు కలగనున్నాయి. దుర్మార్గులు దేవుని మూలంగా పలకడం గురించి ఇతర ఉదాహరణలకు సంఖ్యా 23—24 అధ్యాయాలు; 1 సమూయేలు 11:9-11 నూ వాటి నోట్స్‌నూ చూడండి. దేవుడు తాను ఎన్నుకున్న ఏ సాధనాన్నైనా తన సంకల్ప సిద్ధికి వాడుకోగలడు.

52. యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
ఆదికాండము 49:10

53. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.

ఇంతకుముందు వారు యేసుప్రభువును చంపడానికి ప్రయత్నం చేశారు (యోహాను 5:18; యోహాను 8:59). అయితే అప్పుడు వారు అకస్మాత్తుగా వచ్చిన ఉద్రేకంలో అలా చేయబోయారు. ఇప్పుడైతే అలా చేసేందుకు సరైన విధానమేదోనని కుట్ర పన్నసాగారు.

54. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగ ముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.

యేసు ఇలా చేసినది భయంవల్ల కాదు. తన మరణ సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు (యోహాను 7:30). అది రాకముందు ఆయన చేయవలసిన పనులింకా ఉన్నాయి.

55. మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.
2 దినవృత్తాంతములు 30:17

56. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

ఆ సమయంలో యేసుకు ఉన్న పేరుప్రఖ్యాతులకు ఇది సూచన. ఇస్రాయేల్ దేశమంతటినుంచీ పండుగకు వచ్చిన వారందరూ ఆయన్ను గురించే చర్చించుకుంటున్నారు.

57. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

లాజరస్ యొక్క అనారోగ్యం. (1-6) 
క్రీస్తు ప్రేమను ఇష్టపడే వారు అనారోగ్యం అనుభవించడం ఒక కొత్త సంఘటన కాదు; శారీరక రుగ్మతలు అవినీతిని సరిదిద్దడానికి మరియు దేవుని ప్రజల కృపలను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. క్రీస్తు తన అనుచరులను అటువంటి బాధల నుండి రక్షించడానికి రాలేదు కానీ వారి పాపాల నుండి మరియు రాబోయే కోపం నుండి వారిని రక్షించడానికి వచ్చాడు. ఏది ఏమైనప్పటికీ, మన జబ్బుపడిన మరియు బాధిత స్నేహితులు మరియు బంధువుల తరపున ఆయనను వెతకవలసిన బాధ్యత మనపై ఉంది. ప్రొవిడెన్స్ యొక్క అత్యంత అస్పష్టమైన మలుపులు కూడా దేవుని మహిమ కోసం నిర్వహించబడుతున్నాయని అర్థం చేసుకోవడంలో మనం ఓదార్పుని పొందుతాము-అది అనారోగ్యం, నష్టం లేదా నిరాశ ద్వారా కావచ్చు. దేవుడు మహిమపరచబడితే, మన తృప్తి అనుసరించాలి.
మార్త, ఆమె సహోదరి, లాజరులపట్ల యేసుకు ఉన్న వాత్సల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ మరియు శాంతి వర్ధిల్లినప్పుడు కుటుంబాలు అదృష్టవంతులు అయితే, నిజమైన సంతోషం యేసు ప్రేమను పొందడం మరియు ఆ ప్రేమను తిరిగి పొందడంలోనే ఉంటుంది. దురదృష్టవశాత్తు, చిన్న కుటుంబాలలో కూడా యేసుతో అలాంటి సామరస్యపూర్వక సంబంధం చాలా అరుదు. దేవుని జాప్యాలు ప్రయోజనం లేకుండా లేవని గుర్తించడం చాలా ముఖ్యం; వాటి వెనుక దయగల ఉద్దేశాలు ఉన్నాయి. తాత్కాలిక లేదా ఆధ్యాత్మిక విమోచన సందర్భంలో, అది బహిరంగమైనా లేదా వ్యక్తిగతమైనా, ఆలస్యం కేవలం అనుకూలమైన క్షణం కోసం వేచి ఉంది.

క్రీస్తు యూదయకు తిరిగి వస్తాడు. (7-10) 
ఆపద సమయాల్లో క్రీస్తు ఎల్లప్పుడూ తన ప్రజలకు తోడుగా ఉంటాడు; అతను వారి పక్కన లేకుండా వారిని ఎప్పుడూ ఆపదలోకి తీసుకెళ్లడు. మన స్వంత సంపద, కీర్తి, సౌలభ్యం మరియు భద్రత కోసం ఉత్సాహంతో ప్రభువు పట్ల ఉత్సాహాన్ని తప్పుగా భావించడం సులభం. కాబట్టి, మన సూత్రాలను పరిశీలించడం చాలా ముఖ్యం. మా పని పూర్తయ్యే వరకు మరియు మా సాక్ష్యం నెరవేరే వరకు మా రోజులు పొడిగించబడతాయి. ఒక వ్యక్తి కర్తవ్య మార్గంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా వివరించబడినట్లుగా మరియు అతని ప్రొవిడెన్స్ ద్వారా నిర్దేశించబడినప్పుడు, ఓదార్పు మరియు సంతృప్తి ఉంటుంది. క్రీస్తు, తన భూలోక ప్రయాణంలో, పగటిపూట నడిచాడు, అలాగే మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటే మనం కూడా నడుస్తాము. అయినప్పటికీ, ఎవరైనా తమ హృదయపు కోరికలను అనుసరించి, ప్రపంచ మార్గాలకు అనుగుణంగా ఉంటే, దేవుని చిత్తం మరియు మహిమపై కంటే వారి స్వంత ప్రాపంచిక తర్కంపై ఎక్కువగా ఆధారపడినట్లయితే, వారు ప్రలోభాలు మరియు ఉచ్చులలో పడే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి పొరపాట్లు చేస్తాడు, ఎందుకంటే వారికి మార్గనిర్దేశం చేసే అంతర్గత కాంతి లేదు; మన సహజ చర్యలకు మన చుట్టూ ఉన్న కాంతి ఎంత అవసరమో, మనలోని కాంతి మన నైతిక చర్యలకు కీలకం.

లాజరస్ మరణం. (11-16) 
చివరికి మళ్లీ పైకి లేస్తామన్న హామీని బట్టి, నిత్యజీవానికి ఆ పునరుత్థానంపై ఆశాజనకమైన విశ్వాసం మన శరీరాలను వదులుకోవడం మరియు మరణాన్ని ఎదుర్కోవడం మన బట్టలు విప్పి నిద్రపోవడం వంటి అప్రయత్నంగా ఎందుకు చేయకూడదు? నిజమైన క్రైస్తవుడు మరణించినప్పుడు, అది ప్రశాంతమైన నిద్రతో సమానం-ముందు రోజు శ్రమల నుండి విశ్రాంతి. నిజానికి, మరణం అనేది నిద్రను అధిగమిస్తుంది, అంటే నిద్ర అనేది క్లుప్తమైన విశ్రాంతి అయితే, మరణం అనేది భూసంబంధమైన శ్రమలు మరియు శ్రమల ముగింపును సూచిస్తుంది.
లాజరస్ పట్ల శిష్యులు మొదట విముఖత చూపినట్లే, బహిర్గతం మరియు ప్రమాదం గురించి భయపడి, సవాలు చేసే పరిస్థితులలో క్రీస్తు మనలను నడిపించడం అనవసరమని మనం భావించే సమయాలు ఉన్నాయి. తరచుగా, ఎవరైనా అవసరమైన మంచి పనిని చేపడతారని మేము ఆశిస్తున్నాము, ప్రత్యేకించి ప్రమాదం ఉన్నట్లయితే. అయినప్పటికీ, క్రీస్తు లాజరును మృతులలోనుండి లేపినప్పుడు ప్రదర్శించబడినట్లుగా, అలాంటి చర్యలు అనేకులు ఆయనను విశ్వసించేలా చేయగలవు, విశ్వాసం బలపడటానికి గణనీయంగా తోడ్పడతాయి.
సవాళ్లను ఎదుర్కోవడంలో, కష్ట సమయాల్లో థామస్ చేసినట్లుగా క్రైస్తవులు ఒకరికొకరు మద్దతునివ్వాలి. ప్రభువైన యేసు మరణము దేవుడు కోరినప్పుడల్లా మన స్వంత మరణాన్ని స్వీకరించే సంసిద్ధతను మనలో కలిగించాలి. మరణము మనలను క్రీస్తు ప్రేమ నుండి విడదీయదు, లేదా ఆయన దైవిక పిలుపుకు మించిన మనలను ఉంచదు.

క్రీస్తు బేతనియకు వస్తాడు. (17-32) 
దేవుని భయము, మరియు అతని ఆశీర్వాదం ఉన్న ఈ నివాసంలో, శోక వాతావరణం ఉంది. దయ హృదయాన్ని దుఃఖం నుండి రక్షించగలదు, కానీ అది ఇంటిని దాని నుండి మినహాయించదు. దేవుడు తన కృప మరియు ప్రొవిడెన్స్ ద్వారా దయ మరియు ఓదార్పుతో మనలను సమీపించినప్పుడు, మార్తాలాగే మనం కూడా ఆయనను కలవడానికి విశ్వాసం, ఆశ మరియు ప్రార్థనతో ఉత్సాహంగా ముందుకు సాగాలి.
మార్త యేసును ఎదుర్కోవడానికి బయలుదేరినప్పుడు, మరియ ఇంట్లోనే కూర్చుని ఉంది. ఈ ప్రవృత్తి ఒకప్పుడు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, అతని బోధనలను గ్రహించడానికి ఆమెను క్రీస్తు పాదాల వద్ద ఉంచడం, కష్ట సమయాల్లో, అది ఆమెను విచారం వైపు మొగ్గు చూపింది. ప్రలోభాలకు వ్యతిరేకంగా మనం అప్రమత్తంగా ఉండటం మరియు మన సహజ స్వభావాల ప్రయోజనాలను ఉపయోగించుకోవడం తెలివైన పని. ప్రత్యేకంగా ఏమి అడగాలి లేదా ఆశించాలి అనే దాని గురించి అనిశ్చితంగా ఉన్నప్పుడు, మనల్ని మనం దేవునికి అప్పగించడం వివేకం, అతను ఉత్తమంగా భావించేదాన్ని చేయడానికి అనుమతించడం.
మార్తా యొక్క అంచనాలను పెంచడానికి, మన ప్రభువు తనను తాను పునరుత్థానం మరియు జీవితంగా ప్రకటించుకున్నాడు. ప్రతి కోణంలో, ఆయన పునరుత్థానం-దాని మూలం, పదార్ధం, మొదటి ఫలాలు మరియు కారణం. విమోచించబడిన ఆత్మ మరణం తర్వాత శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది మరియు పునరుత్థానం తరువాత, శరీరం మరియు ఆత్మ రెండూ అన్ని చెడుల నుండి శాశ్వతంగా భద్రపరచబడతాయి.
మరణానంతర జీవితంలోని లోతైన అంశాల గురించి క్రీస్తు మాటలు చదివిన తర్వాత లేదా విన్న తర్వాత, మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఈ సత్యాన్ని మనం నిజంగా నమ్ముతున్నామా? నిత్యత్వపు సత్యాలను మనం వాటికి అర్హమైన విషయంలో కలిగి ఉంటే ప్రస్తుత ఆనందాలు మరియు సవాళ్లు మనపై తక్కువ లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మన గురువు క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన మనలను పిలుస్తాడు. అతను తన మాటలు మరియు శాసనాల ద్వారా వస్తాడు, మనలను వారి వద్దకు పిలుస్తాడు, వారి ద్వారా మనల్ని పిలుస్తాడు మరియు చివరికి మనల్ని తన వైపుకు ఆహ్వానిస్తాడు. శాంతి సమయాల్లో, క్రీస్తు నుండి నేర్చుకునేందుకు అతని పాదాల వద్ద తమను తాము నిలబెట్టుకునే వారు, ఆపద సమయంలో, ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు నిశ్చయతతో ఆయన పాదాల వద్ద తమను తాము వేసుకోవచ్చు.

అతను లాజరును లేపుతాడు. (33-46) 
ఈ దుఃఖిస్తున్న స్నేహితుల పట్ల క్రీస్తు ప్రగాఢమైన కనికరం అతని ఆత్మ యొక్క గందరగోళం ద్వారా స్పష్టంగా కనిపించింది. విశ్వాసులు ఎదుర్కొనే ప్రతి పరీక్షలో, ఆయన వారి బాధలలో పాలుపంచుకుంటాడు. అతని నిష్క్రమించిన స్నేహితుడి అవశేషాల గురించి అతని శ్రద్ధగల విచారణలో వారి పట్ల అతని శ్రద్ధ వ్యక్తమైంది. మనిషి రూపాన్ని ధరించి, మనుష్యుల తీరులో తనను తాను నడిపించాడు. అతని సానుభూతి కన్నీళ్ల ద్వారా మరింత ప్రదర్శించబడింది, అతను దుఃఖంతో పరిచయం ఉన్న వ్యక్తిగా, కరుణతో కన్నీళ్లు కార్చాడు-క్రీస్తును ప్రతిబింబించే సెంటిమెంట్. అయితే, క్రీస్తు కల్పిత బాధల కథల కోసం కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చాలా మంది గొప్పగా చెప్పుకునే భావోద్వేగ సున్నితత్వాన్ని ఆమోదించలేదు, కానీ నిజమైన బాధల పట్ల ఉదాసీనంగా ఉంటారు. పనికిమాలిన ఉల్లాస దృశ్యాల నుండి వైదొలగడానికి, బాధలో ఉన్నవారిని ఓదార్చడానికి మన దృష్టిని మళ్లించడానికి అతను మనకు ఒక ఉదాహరణగా నిలిచాడు. మన బలహీనతలపై సానుభూతి చూపగల ప్రధాన పూజారి ఉండటం మన అదృష్టం.
రాయి తీసివేయబడినప్పుడు, పక్షపాతాలను పక్కన పెట్టినప్పుడు మరియు వాక్యం హృదయంలోకి చొచ్చుకుపోయే మార్గం తెరవబడినప్పుడు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం వైపు పురోగతి ఏర్పడుతుంది. క్రీస్తు వాక్యం, శక్తి మరియు విశ్వసనీయతపై విశ్వాసం ఉంచడం వల్ల మనం దేవుని మహిమను సాక్ష్యమివ్వడానికి మరియు ఆ దృష్టిలో ఆనందాన్ని పొందగలుగుతాము. మన ప్రభువైన యేసు, తన స్వంత ఉదాహరణ ద్వారా, ప్రార్థనలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించమని బోధించాడు, వినయపూర్వకమైన భక్తితో మరియు పవిత్ర ధైర్యంతో ఆయనను చేరుకుంటాడు. దేవునితో అతని బహిరంగ సంభాషణ, ఎత్తైన కళ్ళు మరియు పెద్ద స్వరంతో గుర్తించబడింది, తండ్రి తనను తన ప్రియమైన కుమారుడిగా ప్రపంచంలోకి పంపాడని నమ్మదగిన ప్రకటనగా పనిచేసింది.
క్రీస్తు తన శక్తి మరియు సంకల్పం యొక్క నిశ్శబ్ద శ్రమ ద్వారా లాజరస్‌ను పునరుత్థానం చేయగలిగినప్పటికీ, అతను బిగ్గరగా పిలుపునిచ్చాడు. ఈ చర్య సువార్త పిలుపును సూచిస్తుంది, ఆత్మీయంగా చనిపోయిన ఆత్మలను పాప సమాధి నుండి బయటకు తీసుకువస్తుంది మరియు చివరి రోజున ప్రధాన దేవదూత ట్రంపెట్ ధ్వనిని సూచిస్తుంది, గొప్ప న్యాయస్థానం ముందు దుమ్ములో నిద్రిస్తున్న వారందరినీ పిలుస్తుంది. క్రీస్తు పునరుజ్జీవింపబడిన వారికి పాప సమాధిలో మరియు ఈ లోకంలో స్థానం లేదు; అవి తప్పక ఉద్భవించాయి. లాజరు తిరిగి బ్రతికించడమే కాకుండా పూర్తిగా తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. అదేవిధంగా, ఒక పాపి తన స్వంత ఆత్మను పునరుద్ధరించుకోలేడు, వారు దయ యొక్క మార్గాలను ఉపయోగించాలి. అలాగే, ఒక విశ్వాసి తమను తాము పవిత్రం చేసుకోలేరు, కానీ వారు ప్రతి అవరోధాన్ని విస్మరించాలి. మనం మన బంధువులు మరియు స్నేహితులను మార్చలేనప్పటికీ, మనం వారికి సూచనలను అందించాలి, హెచ్చరికలు అందించాలి మరియు ఆహ్వానాలను అందజేయాలి.

యేసుకు వ్యతిరేకంగా పరిసయ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. (47-53) 
ఇక్కడ అందించబడిన రికార్డు మానవ హృదయంలో వేళ్లూనుకున్న మూర్ఖత్వానికి మరియు దేవునిపట్ల దాని తీరని శత్రుత్వాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తుంది. ప్రవచనాత్మక పదాలను ఉచ్చరించడం హృదయంలోని దయగల సూత్రానికి స్పష్టమైన రుజువుగా ఉపయోగపడదు. హాస్యాస్పదంగా, పాపం ద్వారా మనం తప్పించుకోవాలనుకునే విపత్తు తరచుగా మనపై మనం తెచ్చుకునే పర్యవసానంగా మారుతుంది. ఇది క్రీస్తు రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ, తమ స్వంత ప్రాపంచిక ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్తున్నామని నమ్మే వారికి సమానంగా ఉంటుంది. అయితే, చెడ్డవారు భయపడతారేమోననే భయం చివరికి వారిని అధిగమిస్తుంది.
ఆత్మలను మార్చడం అనేది క్రీస్తును వారి సార్వభౌమాధికారం మరియు పవిత్ర స్థలంగా ఆకర్షిస్తుంది, దీని కోసం అతను తనను తాను త్యాగం చేశాడు. అతని మరణం ద్వారా, అతను వాటిని తన కోసం సంపాదించుకున్నాడు మరియు వారి కోసం పరిశుద్ధాత్మ బహుమతిని పొందాడు. విశ్వాసుల పట్ల ఆయన మరణంలో ప్రదర్శించబడిన ప్రేమ వారి మధ్య బలమైన బంధాన్ని పెంపొందించాలి.

యూదులు అతని కోసం వెతుకుతున్నారు. (54-57)
మన సువార్త పాస్ ఓవర్కు ముందు, మన పశ్చాత్తాపాన్ని రిఫ్రెష్ చేసుకోవడం అత్యవసరం. చాలా మంది వ్యక్తులు, వారి చుట్టూ ఉన్నవారి కంటే ఎక్కువ భక్తితో, జెరూసలేంలో పాస్ ఓవర్‌కు దారితీసే రోజులలో స్వచ్ఛంద శుద్దీకరణ మరియు మతపరమైన వ్యాయామాలలో పాల్గొంటారు. దేవునితో ఒక ఎన్‌కౌంటర్ కోసం ఎదురుచూడేటప్పుడు, గంభీరమైన తయారీ అవసరం. మానవ నిర్మిత పథకాలు దేవుని ఉద్దేశాలను మార్చలేవు, మరియు కపటవాదులు ఆచారాలు మరియు వాదోపవాదాలలో పాల్గొంటున్నప్పుడు మరియు ప్రాపంచిక వ్యక్తులు వారి స్వంత అజెండాలను అనుసరిస్తున్నప్పుడు, యేసు తన మహిమ మరియు తన ప్రజల మోక్షం కోసం అన్ని విషయాలను ఆర్కెస్ట్రేట్ చేస్తూనే ఉన్నాడు.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |