యేసు సిలువలో పలికిన యేడు మాటలు - మూడవ మాట


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

ముగ్గురు వ్యక్తులు.. మూడు వ్యక్తీకరణలు

యిదిగో నీ కుమారుడు...యిదిగో నీ తల్లి యోహాను సువార్త 19:26,27

1. కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి బాధ:
ప్రథమఫలమైన యేసు క్రీస్తును పరిశుద్దాత్మద్వారా పొందినప్పుడు ఆమె జీవితం ధన్యమయింది. ఆయన్ని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా చూడాలనుకుంది. ఈ లోకంలో ఏ తల్లైనా తన కుమారుని యెడల ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది. కాని సిలువలో తన కుమారుణ్ణి చూడవలసి వచ్చేసరికి ఆమె హృదయం పగిలిపోయింది. ప్రసవ వేదన కంటే భయంకరమైన సిలువ శ్రమ చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరై విలపించింది. కడవరకు కుమారుని కనిపెట్టుకొని ఉంది.

2. తల్లి పట్ల కుమారుని బాధ్యత:
కుటుంబం యొక్క ప్రాధాన్యత, కుటుంబం పట్ల మన బాధ్యత ఎలా నిర్వర్తించాలో యేసుక్రీస్తు మాటలను బట్టి నేర్చుకోవచ్చు. అంతేకాదు, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమను ఆజ్ఞ యెడల ఆయన విధేయత చూసి నేర్చుకోగలం. తలిదండ్రులను గౌరవించి వారి ప్రతి సమస్యలో ఇబ్బందిలో మనవంతు బాధ్యత కలిగియుండడం క్రీస్తును పోలి నడుచుకునే క్రైస్తవ జీవితం.

3. తనకు అప్పజెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు:
మనమాయనకు అందుబాటులో ఉండాలని దేవుడు పని అప్పజెప్పాడు గాని, దేవునికి అందుబాటులో ఉన్నవారికే పని అప్పజెప్పుతాడని గ్రహించాలి. ఈ అనుభవం కేవలం క్రీస్తును సంపూర్ణంగా అర్ధం చేసుకున్నవారికే సాధ్యం. యోహాను క్రీస్తును సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాడు కాబట్టే సిలువకు దగ్గరగా, ఆయనకు అందుబాటులో ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పగానే తన యింట చేర్చుకొన్నాడు. క్రీస్తుకు ఎంత సన్నిహితంగా మనం జీవిస్తే, అంత దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది, క్రీస్తుతో మన అనుబంధం పరిపూరణ్ణం అవుతుంది. ఈ అనుభవం గుండా ప్రయాణించే మనకు దేవుడు పని అప్పజెప్పుతాడు. అప్పజెప్పిన పనిని నెరవేర్చినప్పుడు దేవుడు మనలను అశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు.