(యెహోషువ 15:13-19)
అరుదుగా వినిపించే ఈ స్త్రీ పేరు అక్సా. ఈ పేరునకు “కడియం” అని అర్థం ఈమె యెపున్నె కుమారుడైన కాలేబు పుత్రిక, కాలేబు అనాకీయుల దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత దేబీరు నివాసుల మీదికి తన దృష్టిని సారించాడు. దానిని కొల్లగొట్టినవారికి తన కుమార్తెయైన అక్సాను యిచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించాడు. కాలేబు సహోదరుని కుమారుడైన ఒత్నీయేలు ఈ ప్రయత్నంలో నెగ్గినందున అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిగించాడు దక్షిణ భూమిని పెండ్లి కానుకగా ఇచ్చాడు.
వివాహానంతరం అక్సా తన భర్తతో సంప్రదించి, తండ్రి యొద్దకు వచ్చి నీటి మడుగులను అడుగగా అతడు పల్లపు మడుగులను మెరకమడుగులను యిచ్చినట్లు వాక్యభాగములో మనము చూడగలము (యోహాను 15:18-19) అక్సా గాడిద దిగగానే తండ్రి నుండి దీవెనలు కోరుకుంది (యోహాను 15:18) తండ్రి యొక్క దీవెన తనను వర్ధిలజేస్తుందని ఆమె విశ్వసించింది. “నీవు దీర్ఘయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము” అనే దేవుని ఆజ్ఞను ఆమె అమలుపరిచింది తండ్రి కూడా ఆమె విధేయతకు ముగ్ధుడై ఆమె కోరిన విధముగా మడుగులను దయచేశాడు. ఆమె బాలికగాను కన్యగాను ఉన్ననాటినుండి తన తండ్రి యొక్క గుణగణాలను అంచనా వేసుకుంది. తన తండ్రి అడిగినవి యిస్తాడని నమ్మింది. మడుగులను కోరి రెండింతలుగా ఫలితాన్ని సాధించింది. “అడుగుడి మీకియ్యబడును” అని సెలవిచ్చిన మన పరమ తండ్రిని అడిగి మనము ఈవులను సంపాదించుకోగలుగూతున్నామా అని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
బైబిల్ గ్రంథములో అక్సా పేరు పై అద్యాయములోను, (న్యాయాధిపతులు 1:12-15;1 దినవృత్తాంతములు 2:49) లో మాత్రము నేను చూడగలిగినాను. ఇంత తక్కువ ప్రాచుర్యముగల ఈ స్త్రీ కొరకు ఒత్నీయేలు తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడాడంటే ఆమెలో అతనికి నచ్చిన ప్రత్యేకత ఏదో ఉండి ఉంటుంది. అక్సా శరీర సౌందర్యము కలిగి ఉండవచ్చును. కాని అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని బైబిల్ సెలవిస్తుంది. యెహోవావయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథకర్త వ్రాసినట్టుగా ఈమె దైవభక్తి అతనికి నచ్చియుండవచ్చు. యెహోవాయందు భయమే జ్ఞానమునకు మూలము గనుక ఈమె జ్ఞానవంతురాలై తన గృహనిర్వహణ జరిగియుండవచ్చు. ఆనాటి స్త్రీలకు నేటి స్త్రీలవలే ప్రాథాన్యత ఇవ్వబడలేదు ఈ రోజుల్లాగ రిజేర్వేషనులు వగైరా అసలేలేవు.
కుటుంబ చరిత్రలో కూడా స్త్రీ ప్రస్తావన చాలా స్వల్పముగా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులకు ప్రధానుడైన యాకోబుకు పన్నెండు మంది కొడుకులు కాగా ఒక్కతే కుమార్తె కలదు. అట్టి సమాజంలో జీవించిన అక్సా దైవభక్తి గలవారము అని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సంపూర్ణ విధేయతతో సత్ క్రియలు చేయుచూ, సంఘకార్యకలాపములలో చాటుగావుండి భర్తను ప్రోత్సహించుచూ, బిడ్డలను దైవభక్తిలో పెంచియుండవచ్చునని నమ్మాలి.(ద్వితీయోపదేశకాండము 11:18-19) వచనములలో తల్లులు తమ పిల్లలకు నేర్పవలసిన సంగతులను గూర్చి వ్రాయబడివుంది. ప్రియనేస్తం మనము మన పిల్లలకు ఏమీ నేర్పుతున్నాము సమాజంలో ఘనత, విద్య, ర్యాంకులు, ఉద్యోగము వీటిచే మన పిల్లలను ప్రోత్సహించుటగాక ఆయన రాజ్యము నీతిని మొదట వెదికేలా చేయాలి. నీ బాలురను శిక్షించుట మానకుము నీ కుమారుని శిక్షింఛిన యెడల అతడు నిన్ను సంతోషపరచును. (సామెతలు 19:18) పిల్లలను శిక్షించి పెంచాలని బైబిల్ తేట తెల్లముగా వెల్లడించుచున్నది. మన ప్రియ పిల్లల యెడల మన కర్తవ్యమెలా వుందో అలోచించుకుందాం.
చివరిగా ఆలోచిస్తే ఊటలు లేనిదే పొలము ఫలించదనే సత్యాన్ని అక్సా గ్రహించింది. అందుకే కీర్తనాకారుడు మా ఊటలు నీయందె ఉన్నవని కీర్తనల గ్రంథము 87:7 లో వ్రాశాడు. జీవపు ఊటలలో అక్సా తన జీవితవేరులను, కుటుంబవేరులను పెంపుజేసుకున్నది, మేలు అనుభవించింది. బైబిల్ గ్రంథమును పరిశీలించినట్లయితే జీవపు ఊటలకై తపించిన స్త్రీలు మరికొందరు కనిపిస్తారు. శారా దాసియైన హాగరు బెయెర్షబా అడవులలో ఎలుగెత్తి యేడ్చుట ద్వారా నీటి ఊటలను సంపాదించుకొనగలిగినది. దప్పిగొనిన వారలారా నీళ్ళయొద్దకు రండి అని ప్రభువు పిలుచుచున్నాడు. ఆయన యిచ్చే ఊటలు సాక్షాత్తు ప్రభువు సిలువపై కార్చిన రక్తధారలేనని ప్రతివారు గ్రహించాలి. అవి జీవింపేజేసే జీవపు ఊటలని గ్రహించలేక అపవిత్రమైన ఊటలను తృణీకరించి లోకసంబంధమైన తొట్టెలను మన కొరకు ఏర్పాటు చేసుకొనుచున్నాము.
ఈ విషయమై బైబిల్ ఇలా సెలవిస్తుంది “నా జనులు రెండు నేరములు చేయుచున్నారు. మొదటిగా జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు రెండవదిగా వారి కొరకు బ్రద్ధలై నీళ్ళు నిలవని తొట్టెను తొలిపించుకొనియున్నారు” అని మన ప్రభువు ఎంతో ఆవేదన చెందుతున్నాడు.
(యిర్మియా 2:13) క్యాలండర్లో నూతన సంవత్సర సంఖ్యను సంఖ్యను చూచి పొంగిపోతున్న మనము అక్సావలే మన కుటుంబములను, నీటి ఊటల వద్దకు నడిపించాలి. రాబోవు తరములను నీటిబాటలో నడిపించవలసిన గొప్ప బాధ్యతను దేవుడు స్త్రీల మీద ఉంచాడు. గనుక ప్రార్థించే తల్లులముగానూ అయన రాకడకొరకు నమ్మకమైన సాక్షులముగాను ఉండాలని ప్రభువు కోరుచున్నాడు.